కరోనా కల్లోలం! అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ.. ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్

  • కరోనా నివారణ చర్యల కోసం 5 వేల కోట్ల డాలర్ల విడుదల 
  • కరోనా పరీక్షలు చేయించుకునే అవకాశం ఉందన్న ట్రంప్
  • ట్రంప్‌ను కలిసిన బ్రెజిల్ అధ్యక్షుడి కమ్యూనికేషన్ చీఫ్‌కు కరోనా పాజిటివ్
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 5436 మంది ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 1.50 లక్షల మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. అమెరికాలోనూ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ట్రంప్ ప్రభుత్వం అప్రమత్తమైంది.

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని (హెల్త్ ఎమర్జెన్సీ) విధించారు. అలాగే, నివారణ చర్యల కోసం 5 వేల కోట్ల డాలర్లు విడుదల చేస్తున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నిన్న వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో ట్రంప్ కరోనా బాధితులను కలుసుకున్న నేపథ్యంలో.. తాను ఇప్పటి వరకు కరోనా పరీక్షలు చేయించుకోలేదని, చేయించుకునే అవకాశాలు ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో, ఆయన కమ్యూనికేషన్ చీఫ్ ఫాబియోను ట్రంప్ కలిశారు. తాజాగా ఫాబియోకు వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగా, బోల్సోనారోకు మాత్రం కరోనా సోకలేదని తేలింది. ఈ విషయమై ట్రంప్ మాట్లాడుతూ.. తాను దాదాపు రెండు గంటలపాటు బోల్పోనారోతో కలిసి ఉన్నట్టు చెప్పారు. ఇద్దరం కలిసి భోజనం చేశామని, పక్కపక్కనే ఉన్నామని పేర్కొన్నారు. అయితే, ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకలేదని తేలిందని, కాబట్టి తనకొచ్చిన ఇబ్బందేమీ లేదని ట్రంప్ వివరించారు.

Donald Trump
America
Health Emergency
Corona Virus

More Telugu News